ప్రభుత్వ చర్యలతో మత కలహాలు జరిగే ప్రమాదముంది: కన్నా లక్ష్మీనారాయణ
ఏపీ ప్రభుత్వ తీరును విమర్శిస్తూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని లేఖలో వివరించారు. హిందూ దేవాలయాలను, సత్రాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తుందని.. ఎక్కడా అవకాశం లేనట్లు అన్నవరం కొండ ప్రాంతాన్ని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. అన్నవరంలో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటును నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సీఎస్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాల వద్ద క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రజా అవసరాల పేరుతో ఇలాంటి చర్యలకి పాల్పడితే.. రాష్ట్రంలో సామాజిక అసమానతలు, మత కలహాలు జరిగే ప్రమాదముందని కన్నా అభిప్రాయం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com