అడవి బిడ్డను పొట్టన పెట్టుకున్న పులి..

వారం రోజుల్లో నలుగురిని చంపేసింది.. కరోనా కాదు పులి. అడవి తల్లినే నమ్ముకుని జీవనాధారం సాగిస్తున్న అడవి బిడ్డలను పులులు పొట్టన పెట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర భండారా జిల్లా సావర్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు.. మమత, నరేష్లు ఆదివారం తెల్లవారు జామున అడవికి వెళ్లారు. విప్ప పువ్వు సేకరించి సంతలో అమ్ముకుందామని వెళ్లారు. చెరో దిక్కున వెళ్లి విప్ప పువ్వు సేకరిస్తున్నారు. ఇంతలో పులి మమతకు సమీపంగా వచ్చింది. దాన్ని చూసి ఆమె పెద్దగా కేకలు వేసింది. అయినా పులి ఒక్క ఉదుటన మమత మీదకి దూకి ఆమె మెడను కొరికింది.
భార్య అరుపులు విన్న భర్త వెంటనే అక్కడకు చేరుకున్నాడు. పులిని తరిమి గాయపడ్డ మమతను భుజాన వేసుకుని రోడ్డు మీదకు వచ్చాడు. సమీప ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి వాహనం ఏదైనా దొరుకుతుందేమో అని చూశాడు. కానీ లాక్డౌన కారణంగా ఒక్క వాహనం రాలేదు. ఈలోపే మమత తీవ్ర రక్త స్రావంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి వివేక్ హోసింగ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పౌనీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక సాయంగా భర్త నరేష్కు రూ.25 వేలు అందించారు. కాగా, ఈ దంపతులకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com