ముకేశ్‌ అంబానీకి మరోసారి మొదటిస్థానం

ముకేశ్‌ అంబానీకి మరోసారి మొదటిస్థానం
X

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి ఆసియాలోని అత్యంత ధనవంతుడి జాబితాలో చేరారు. జియో ప్లాట్‌ఫామ్స్‌తో ఫేస్‌బుక్‌ జత కట్టడంతో.. చైనా దిగ్గజం అలీబాబా అధినేత జాక్ మా ను వెనక్కు నెట్టి.. అంబానీ మొదటి స్థానానికి చేరుకున్నారు. ఫేస్‌బుక్‌తో చేసుకున్న ఒప్పందం చేసుకున్న తరువాత అంబానీ నికర ఆస్తుల విలువ 4.69 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ 49.2 బిలియన్ డాలర్లకు చేరింది. జాక్ మా నికర ఆస్తుల విలువ 46 బిలియన్ డాలర్లుగా ఉంది.

కరోనా మహమ్మారి దెబ్బకి చమురు ధరలు భారీ పతనాన్ని చూశాయి. దీంతో రిలయన్స్‌ అంబానీ భారీగా నష్టపోయారు. దీంతో అంబానీ స్థానాన్ని చైనా దిగ్గజం అలీబాబా అధినేత జాక్ మా అధిగమించారు.

అయితే, తాజాగా.. ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకోవటంతో అంబానీ మరోసారి తన స్థానాన్ని సొంతం చేసుకున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్‌బుక్ సంస్థ 9.99 శాతం వాటాను 570 కోట్ల డాలర్లకు సొంతం చేసుకుంది. దీంతో.. జియో ప్లాట్‌ఫామ్స్‌లో అతిపెద్ద మైనారిటీ షేర్‌హోల్డర్ గా ఫేస్‌బుక్‌ మారింది. జియో ప్లాట్‌ఫామ్స్‌ బోర్డులో స్థానం కూడా ఫేస్‌బుక్ కు కల్పించారు. అంబానీ కుమారుడు ఆకాశ్‌, కుమార్తె ఇషా ఈ కంపెనీ బోర్డులో సభ్యులుగా ఉన్నారు.

Tags

Next Story