అందరి చూపు వ్యాక్సిన్ వైపు.. ప్రపంచ దేశాలన్నీ అదే పనిలో..

అందరి చూపు వ్యాక్సిన్ వైపు.. ప్రపంచ దేశాలన్నీ అదే పనిలో..

కంటికి కనిపించని కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా ధాటికి తట్టుకోలేక అల్లకల్లోల మవుతున్నాయి. ఓ వైరస్ ఇంతటి విపత్తుని సృష్టిస్తుందని ఊహించని అగ్రరాజ్యం సైతం ఆకాశం వైపు చూస్తోంది. ఏం చేస్తే కరోనాని కట్టడి చేయగలం అని రాత్రింబవళ్లు ఆలోచిస్తోంది. దానికి ఒక్కటే సమాధానం వ్యాక్సిన్. అమెరికాతో సహా దాదాపు 180 దేశాలు ఇదే పనిలో ఉన్నాయి. విస్తృత పరిశోధనలు చేస్తూ వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రముఖ మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్' ఈ విషయాన్ని వివరించింది. మరో 150 దేశాలె పరిశోధనల కోసం సమాయత్తమవుతున్నాయి.

కరోనా పుట్టుకకు కారణమైన చైనాలో పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నాయి.

యూనివర్సిటీ ఆఫ మెల్‌బోర్న్, రాడ్‌బబౌడ్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ (నెదర్లాండ్స్), మెసాచుసెట్స్ విశ్వవిద్యాలయంలోని ఫౌస్ట్‌మన్ ల్యాబ్‌లు సంయుక్తంగా ఆస్ట్రేలియాలో టీకా పరిశోధనలు చేస్తున్నాయి.

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలం గురువారం నుంచి తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించనుంది. మనిషిపై ప్రయోగించాక శరీరంలో ఎటువంటి రోగనిరోధక శక్తి కణాలు స్పందిస్తున్నాయో గుర్తిస్తారు.

ఇక కరోనా బారిన పడి అత్యధిక మరణాలు, లెక్కకు మించిన పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్న అమెరికా వ్యాక్సిన్ కోసం విస్తృత పరిశోధనలు చేస్తుంది. దాదాపు 2 డజన్ల కంపెనీలు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో ఉన్నాయి.

జర్మనీకి చెందిన బయోన్‌టెక్, చైనాకు చెందిన ఫూసన్ ఫార్మా, ఫైజర్ సంస్థలు సంయుక్తంగా ఆర్‌ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను పరీక్షించేందుకు అనుమతులు సంపాదించాయి.

ఇక భారత్ విషయానికి వస్తే.. భారత్ బయోటెక్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్, ఫ్లూజెన్‌లు కలిసి సంయుక్తంగా 'కరోఫ్లూ' పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి.

అయితే ప్రయోగాలు విస్తృత స్థాయిలో జరుగుతున్నందున గందరగోళం తలెత్తుంది. సమన్వయంతో పరిశోధనలు సాగిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటుందని నార్వే రీసెర్చ్ కౌన్సిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ ఆర్న రొట్టంగన్ ది లాన్సెట్ పత్రికతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అయితే చైనా తానే ముందుగా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టాలన్న ఆలోచనతో పరిశోధన ఫలితాలను బయటకు వెల్లడించడం లేదు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆలోచన ఎంత మాత్రం మంచిది కాదని పరిశోధకులు విజ్ఞానాన్ని పంచుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరించాలని సింగపూర్‌లోని డ్యూక్ ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ వైరాలజిస్ట్ ఆస్లే జాన్ అంటున్నారు.

వివిధ దేశాల్లో జరుగుతున్న పరిశోధనలకు సమన్వయ బాధ్యతను ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో) స్వీకరించింది. వ్యాక్సిన్ వచ్చే లోపు ఓ రకాల చికిత్సల ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడే ప్రయత్నాలు చేయనుంది.

ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కోసం పని చేస్తున్న సంస్థలో ఓ ఆరు సంస్థలు తమ ప్రయోగాలను మనుషులపై ప్రయోగించే స్థాయికి చేరుకున్నాయని, ఇవి సత్ఫలితాలనిస్తే కరోనాపై విజయం సాధించినట్లే అని డబ్ల్యుహెచ్‌వో అభిప్రాయ పడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story