సౌదీఅరేబియాలో మైనర్ల మరణశిక్షలపై సంచలన నిర్ణయం

సౌదీఅరేబియాలో మైనర్ల మరణశిక్షలపై సంచలన నిర్ణయం

సౌదీఅరేబియాలో తప్పు చేసిన వాళ్లకు విధించే శిక్షలు చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ ఎలాంటి తప్పులు చేసినా దానికి శిక్షగా కొరడా దెబ్బలు విధించడం, చేతులు నరకడం, తలలు తీసెయ్యడం వంటివి చేస్తుంటారు. అయితే మానవహక్కుల సంఘాలు ఇలాంటి శిక్షల్లో మార్పులు రావాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నాయి. దీంతో సౌదీ అరేబియాలో ఈ చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఇటీవల సౌదీఅరేబియాలో కొరడా దెబ్బలను రద్దుచేసి, బదులుగా జైలుశిక్ష పొడిగించడం, జరిమానా విధించడం లేదా సమాజ సేవ శిక్షలను విధించడం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు.

తాజాగా సౌదీఅరేబియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. మైనర్ల నేరాలకు సంబంధించి మరణశిక్షలను రద్దు చేయాలని ఆ దేశ రాజు సల్మాన్‌ ఆదేశించినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ శిక్షల సడలింపులో రాజు కుమారుడు, వారసుడైన యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

దేశాన్ని ఆధునీకరించి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని యువరాజు చూస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా సౌదీ అరేబియా ప్రతిష్ఠను మెరుగుపర్చాలని ప్రయత్నిస్తున్నారు. యువరాజు ఒకవైపు నేరాల ఆంక్షలు సడలిస్తూనే మరోవైపు తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సౌదీ రాజు తీసుకున్న తాజా నిర్ణయంతో అక్కడ షియా మైనార్టీ వర్గంలోని కనీసం ఆరుగురికి మరణ శిక్ష నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. వీళ్లంతా 18 ఏళ్లలోపు ఉండగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు ఇప్పటికే సౌదీ జైళ్లలో గరిష్ఠంగా పదేళ్లు శిక్ష అనుభవించిన వారి కేసులు ప్రాసిక్యూటర్లు సమీక్షించాలని, వీలైతే వారికి శిక్షలు తగ్గించాలని తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే మైనర్ల ఉగ్రవాద సంబంధిత కేసులను ప్రత్యేకంగా విచారించనున్నట్లు అందులో వెల్లడించారని తెలుస్తోంది. అయితే, ఈ ఉగ్రవాద సంబంధిత కేసులు పదేళ్ల జైలు పరిమితికి లోబడి ఉంటాయో లేదో అన్నది తెలియాల్సి ఉంది. ఆమ్నెస్టీ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థతో పాటు మానవ హక్కుల సంఘాలు కూడా సౌదీలో కనీసం మైనర్లకైనా మరణశిక్షలను రద్దు చేయాలని పోరాడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story