బాలీవుడ్ నటుడు రిషీకపూర్ కన్నుమూత

బాలీవుడ్ అగ్ర నటుడు రిషీకపూర్ (67) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవగా ఆయన సోదరుడు రణ్ధీర్ కపూర్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించినా లాభం లేకపోయింది. గత ఏడాది సెప్టెంబరులో క్యాన్సర్కు చికిత్స తీసుకుని అమెరికా నుంచి భారత్కు వచ్చారు. ఆ తరువాత కూడ తీవ్ర అనారోగ్యాల కారణంగా రెండు సార్లు ఆసుపత్రిలో జాయినై చికిత్స పొందారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రిషి కపూర్ ఏప్రిల్ 2 నుంచి ట్విట్టర్లో ఏ పోస్టూ పెట్టలేదు.
1952 సెప్టెంబరు 4న ముంబయిలో జన్మించిన రిషీ కపూర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కపూర్ రెండో కుమారుడు. ఆర్.కె.ఫిల్మ్స్ బ్యానర్పై పలు చిత్రాలు నిర్మించారు. ఉత్తమ బాల నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. 1973లో తొలిసారి హీరోగా రిషికపూర్ బాబీ చిత్రంలో నటించారు. బాబీ, లైలా మజ్నూ, సర్గమ్, నగీనా, చాందినీ. హనీమూన్, దీవానా, గురుదేవ్ చిత్రాలు రిషికపూర్కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. దాదాపు 51 చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, రిషీకపూర్ హఠాన్మరణం పలువురు బాలీవుడ్ ప్రముఖులను, అభిమానులను కలచివేసింది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com