బ్యాడ్ న్యూస్.. కరోనా రెండేళ్లు ఉంటుంది!
కరోనా దెబ్బకి ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. అయితే ఈ కరోనా మహమ్మారి కష్టాలు త్వరలోనే తీరిపోతాయని ఎదురుచూస్తున్నవారికి శాస్ర్తవేత్తలు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ వైరస్కు ఉన్న ప్రత్యేక సామర్థ్యాలను బట్టి చూస్తే రెండేళ్ల వరకు దీనిని నియంత్రించటం కష్టమేనని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాకు చెందిన అంటువ్యాధుల పరిశోధన కేంద్రం తెలిపింది.
ప్రపంచ జనాభాలో కనీసం 2/3వ వంతు జనాభాలో రోగనిరోధక శక్తి పెరగితే కానీ కరోనా నుంచి తప్పించుకోలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో చాలామందికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండడం లేదని వివరించారు. అయితే వీరికి కాంటాక్ట్లోకి వచ్చిన వారికి మాత్రం వైరస్ వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల ఎవరికి వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలుసుకోవడం కష్టసాధ్యమైపోయిందని పేర్కొన్నారు.
అందుకే మరో రెండేళ్లు గడిచినా కరోనా మానవాళిని విడిచిపెట్టే అవకాశం లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వచ్చే రెండేళ్ల పాటు దఫదఫాలుగా దాడిచేయబోయే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఈ వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ఊపందుకున్నప్పటికీ మరో ఏడాది వరకు అవి అందుబాటులోకి రావని, వచ్చినా తక్కువ మోతాదులోనే ఉంటాయని సంస్థ డైరెక్టర్ మైకేల్ ఓస్టర్హామ్ పేర్కొన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com