'ఉత్తరకొరియా అధినేత కిమ్ వారం కిందటే మృతి చెందారు' : జి సియాంగ్ హో
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మృతి చెందారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన జి సియాంగ్ హో చేసిన వ్యాఖ్యలు ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నాయి. కిమ్ జోంగ్ ఉన్ వారం కిందటే మృతి చెందారని జి సియాంగ్ హో తెలిపారు. దక్షిణ కొరియాకు వలస వచ్చిన జి సియాంగ్ హో, గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. శుక్రవారం స్థానిక యోన్హాప్ వార్త సంస్థతో జి సియాంగ్ మాట్లాడుతూ.. తనకు అందిన సమాచారం ప్రకారం శస్త్రచికిత్స తర్వాత కిమ్ మరణించినట్లు 99 శాతం కచ్చితంగా చెప్పగలనన్నారు. వారసుల ఎంపిక స్పష్టత వచ్చాక కిమ్ మరణాన్ని అధికారంగా ప్రకటించవచ్చన్నారు.
అధికార కార్యక్రమాలకు దూరంగా ఉన్నకిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. . ఏప్రిల్ 11 నుంచి కనిపించక పోయే సరికి ఆయన ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. కోమాలోకి వెళ్లిపోయినందువల్లే ఏప్రిల్ 15న కిమ్ తన తాత 108 జయంతి కార్యక్రమానికి హాజరు కాలేకపోయారంటూ వార్తలు గుప్పుమన్నాయి.
కిమ్ ఆరోగ్యంపై విభిన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఇప్పటికే ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. మరోవైపు తాజా పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందని ఆ దేశం అధికారులు తెలిపారు. కిమ్ మరణించారని నిర్దిష్ట నిఘా సమాచారమేదీ లేదని వారు వివరించారు. కిమ్ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇప్పటికే పేర్కొన్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com