ఆ దేశాల్లో అధిక మరణాలు.. కారణం..

అభివృద్ధి చెందిన దేశాలు సైతం కరోనా మహమ్మారిని ఎదిరించలేక కకావికలమవుతున్నాయి. ఏం చెయ్యాలో తెలియక చేతులెత్తేస్తున్నాయ్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణాల సంఖ్య పెరగడం ఆదేశ అధ్యక్షుల్ని నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది. మహమ్మారి బాధిత దేశాలతో పోలిస్తే భారత్లో కరోనా మరణాల రేటు తక్కువే. అన్నింటా అభివృద్ధి పథంలో పయనిస్తున్న దేశాలు, టెక్నాలజీలో ముందంజలో ఉన్న దేశాలు వైరస్ను కట్టడి చేయలేకపోతున్నాయి.. మరణాల రేటును నియంత్రించలేకపోతున్నాయి.
కారణం వారి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లేనని బ్రిటన్లో డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అసీమ్ మల్హోత్రా అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్ జాతీయ వైద్యసేవా విభాగం సభ్యుల్లో ఒకరైన మల్హోత్రా.. ఊబకాయం, అధిక బరువు కరోనా మరణాలకు ముఖ్య కారణమని అంటున్నారు. భారతీయులు కూడా అనాదిగా వస్తున్న ఆచారాలకు స్వస్తి చెప్పకుండా పాత పద్దతులనే మళ్లీ పరిగణలోకి తీసుకుంటే కరోనాని జయించవచ్చని అన్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు ఫాస్ట్ఫుడ్ కల్చర్కి స్వస్తి చెబితే మంచిదన్నారు.
మంచి ఆహారం, శరీరానికి తగినంత వ్యాయామం, వ్యక్తిగత పరిశుభ్రతతో కరోనాని దూరం చేయవచ్చాన్నారు. టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు అనేవి కరోనా మరణాలకు ప్రధాన కారణాలని ఆయన వివరించారు. శరీరంలో అధికంగా కొవ్వు పేరుకుపోవడం అనేది ప్రధాన సమస్య అని తెలిపారు. అమెరికా, బ్రిటన్లలో 60 శాతం పైగా వయోజనులు స్థూలకాయులని గుర్తు చేశారు. ఆహారపు అలవాట్ల ద్వారానే వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com