వైరస్‌ను పట్టించే మాస్క్.. వచ్చేస్తుంది త్వరలో..

వైరస్‌ను పట్టించే మాస్క్.. వచ్చేస్తుంది త్వరలో..

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ముందుగా వైరస్ సోకిన వారిని గుర్తించే ప్రక్రియ వేగవంతం కావాలి. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలు ఖర్చుతో కూడుకున్నవే కాకుండా, చాలా రోజుల సమయం పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు, కరోనా వైరస్ కొమ్ములు విరిచేందుకు కృత్రిమ జీవశాస్త్రం, కృత్రిమ మేధ వంటి అత్యాధునిక సాంకేతికతల సాయం తీసుకుంటున్నామని మసాచూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన జిమ్ కోలిన్స్ వెల్లడించారు. వాటి సాయంతో కరోనా టీకాను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కణాల్లోని వ్యవస్థలను వేరు చేసి వాటిని కాగితంపై అతికించొచ్చని, దీనికి ఆర్‌ఎన్ఏను జోడించడం ద్వారా ఎబోలా, జికా వైరస్‌లను చౌకగా గుర్తించే కిట్లు గతంలో తయారయ్యయని గుర్తు చేసారు. ఇప్పుడు కూడా అదే టెక్నాలజీని ఉపయోగించి కాగితంపై కాకుండా వస్త్రాల ద్వారా వైరస్ ఉనికిని గుర్తించే మాస్కులను తయారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. శ్వాసతీసుకున్నప్పుడు వచ్చే చెమ్మలో వైరస్ ఉంటే మాస్కులో ఏర్పాటు చేసిన ఆర్ఎన్ఏ సెన్సర్లు వెంటనే స్పందిస్తాయని, ఒకవేళ వైరస్ ఆ వ్యక్తికి సోకినట్లైతే మాస్కు రంగు మారిపోతుందని తెలిపారు. ఈ విధానం ద్వారా వైరస్ సోకిన ఒకటి రెండు గంటల్లోనే రోగిని గుర్తించడం వీలవుతుంది.

దీంతో పాటు దాదాపుగా దశాబ్దకాలం నుంచి క్షయ వ్యాధి నిర్మూలన కోసం ఉపయోగించే బీసీజీ టీకాని కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా కరోనా వైరస్‌ను ఎదుర్కోవచ్చని కోలిన్స్ వివరించారు. బలహీనమైన వైరస్ సాయంతో తయారైన బీసీజీ టీకాను అవసరానికి తగ్గట్టు ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉందని ఆయన తెలిపారు. దీనికే కొన్ని మార్పులు చేస్తే కరోనాకు టీకా సిద్ధమవుతుందని కోలిన్స్ అంచనా. ప్రస్తుతానికి ప్రాథమిక దశలో ఉన్న తమ పరిశోధనలు పూర్తి స్థాయిలో రూపు దాల్చడానికి కొంత సమయం ఫడుతుందని కోలిన్స్ వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story