తక్షణ సహాయక చర్యల వల్లే పెను ప్రమాదాన్ని నివారించగలిగాం: ఆళ్ల నాని
తక్షణ సహాయ చర్యల వల్లే గ్యాస్ లీకేజీ ఘటనలో పెను నష్టాన్ని నివారించగలిగామన్నారు మంత్రి ఆళ్ల నాని. ప్రభావిత 5 గ్రామాల్లో 15 వేల మంది జనాభా ఉన్నారని.. గంటలోనే అందరినీ అప్రమత్తం చేశామని తెలిపారు. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని అన్నారు. దుర్ఘటనకు కారణాలపై నిపుణుల బృందం ఉన్నత స్థాయి సమీక్ష చేస్తోందన్నారు.
మేఘాద్రిగడ్డ నుంచి ముందు జాగ్రత్తగానే నీటి సరఫరా నిలిపివేశామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. గ్యాస్ లీకేజీ వల్ల నీళ్లు కలుషితం అయితే ఇబ్బంది కాబట్టి పరీక్షల కోసం నీరు ఆపేశామన్నారు. పరీక్షల తర్వాత యధావిధిగా సరఫరా ఉంటుందన్నారు. అంత వరకూ ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేశామని బొత్స తెలిపారు.
విశాఖ KGHకు వెళ్లిన మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్, ఆళ్ల నాని, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్లు బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నపిల్లల వార్డులో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించి వైద్య సేవల వివరాలు తెలుసుకున్నారు. KGHలో పిల్ల వార్డులో 54 మంది, పెద్దల వార్డులో 253 మంది చికిత్స పొందుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com