మే11 నుంచి ఇంటర్ పరీక్షా పేపర్ల వాల్యుయేషన్
ఈ నెల 11 నుండి ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభం కానుంది. మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో ఇంటర్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆరెంజ్, గ్రీన్ జోన్ లలో మే 11 నుండి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. లాక్ డౌన్ ముగిసిన అనంతరం రెడ్ జోన్ లో మూల్యాంకన ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. కోవిడ్ - 19 జాగ్రత్తలను పాటిస్తూనే ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే అన్ని సెట్ పరీక్షల తేదీలు ఖరారు కావడంతో ఇంటర్ వాల్యువేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉందన్నారు.
మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు సంబంధించి మొదటి సంవత్సరంలో దాదాపు ఐదున్నర లక్షలు, రెండో సంవత్సంలో ఐదు లక్షల 18వేల విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా పదిన్నర లక్షల మంది విద్యార్ధులు ఎగ్జామ్ రాశారు. వీరికి సంబంధించి 60 లక్షల పేపర్లు వాల్యువేషన్ చేయాలి. 13 జిల్లాల్లోనూ మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియ పాదర్శకంగా, నాణ్యమైనదిగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. రోజూ రెండు షిష్టుల్లో వాల్యువేషన్ జరగనుంది. లాక్ డౌన్ నేపథ్యంలో అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. మొత్తం 25 వేల మంది సిబ్బంది పాల్గొంటారని వీరంతా... భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ, శానిటైజర్ను వినియోగించాల్సి ఉంటుందన్నారు. ముందుగా ఆరెంజ్, గ్రీన్ జోన్ లో సుమారు 15వేల మందితో వాల్యువేషన్ చేపడుతున్నట్లు తెలిపారు. రెడ్ జోన్ లో 8 నుండి 10 వేల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు.
ఇక, జూన్ చివరి నాటికి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో విద్యార్థులకు ఆన్ లైన్ లో థియరీ క్లాసులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో పాఠాలు, ప్రాక్టికల్స్ వీడియోలు ఉంచుతామన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com