ఆ ఏరియాల్లో మరికొన్ని సడలింపులు..

రాష్ట్రంలో మూడో విడత లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరికొన్ని సడలింపులు చేసింది. ఈ నెల 11 నుంచి సడలింపులు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించారు. నిత్యావసర వస్తువుల దుకాణాలతో పాటు, టీ స్టాల్స్ తెరిచేందుకు అనుమతించారు. కంటైన్మెంట్ జోన్లు మినహా రాష్ట్రమంతటా సోమవారం నుంచి ఈ కొత్త సడలింపులు అమల్లోకి వస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
గ్రేటర్ చెన్నై పరిధిలోని అన్ని దుకాణాలు ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంటాయి. మిగిలిన దుకాణాలు ఉదయం 10.30 నుంచి సాయింత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. వైరస్ అధికంగా ఉన్న రెడ్ జోన్లు మినహా రాష్ట్రమంతటా కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులు ఉదయం 6 నుంచి రాత్రి 7 వరకు తెరిచి ఉంటాయి. మిగిలిన దుకాణాలు ఉదయం 10 నుంచి రాత్రి 7 వరకు పని చేస్తాయి. టీ షాపుల వద్ద కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి. ఎవరూ కూర్చుని కాఫీ సేవించకూడదు. రోజుకు ఐదు సార్లు టీ దుకాణాల్లో క్రిమినాశినితో శుభ్రపరచాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వెంటనే షాపులు సీజ్ చేస్తారని సీఎం హెచ్చరించారు.
ఇక పెట్రోల్ బంకులు ఉదయం 6 నుంచి సాయింత్రం 6 వరకు తెరిచి ఉంటాయి. జాతీయ రహదారుల్లో ఉన్న పెట్రోల్ బంకులు 24 గంటలూ పని చేస్తాయి. ఇక ప్రైవేటు సంస్థలూ, కార్యాలయాలు రోజూ ఉదయం 10.30 నుంచి సాయింత్రం 6 గంటల వరకు పని చేస్తాయి. అయితే 33 శాతం ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు హాజరవ్వాల్సి ఉంటుంది. సడలింపుల నిబంధనలన్నీ సరిగా అమలవుతున్నదీ లేనిదీ కలెక్టర్లు, కార్పొరేషన్, మున్సిపల్ కమిషనర్లు, స్థానిక అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ముఖ్యమంత్రి పళనిస్వామిని ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com