సీఎంలతో ప్రధాని మోదీ కీలక వీడియో కాన్ఫరెన్స్

కరోనా కట్టడిలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ -3 మరో వారం రోజుల్లో ముగియనుంది. మే 17 తర్వాత దేశంలో పరిస్థితులు ఏమిటి...? ఎలాంటి సడలింపులు ఉండబోతున్నాయి..? మరోవైపు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో..కరోనా తీవ్రత పెరుగుతూనే ఉంది. అలాంటి చోట్ల ఏం చేయబోతున్నారు.. వంటి అంశాలు దేశవ్యాప్తంగా అందరిలోనూ తీవ్ర ఉత్కంఠత రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి.. ప్రధాని నరేంద్ర మోదీ సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా... రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకోవడానికి.. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంలతో సమావేశమవుతున్నారు. కరోనా వ్యాప్తి పరిస్థితులపై.. మార్చి 20 తర్వాత.. ఇలా సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మాట్లాడటం ఐదోసారి.
ఏప్రిల్ 14న రెండో విడత లాక్డౌన్ను ప్రకటించిన మోదీ.. అదే నెల 20 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించుకునే వెసులుబాటు కల్పించారు. మే 3 నుంచి 17 వరకు లాక్డౌన్ 3 ప్రకటించాక.. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో మరిన్ని మినహాయింపులు, సడలింపులు ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతూనే ఉన్న పరిస్థితుల్లో.. రాబోయే రోజుల్లో ఏం చేద్దామని... రాష్ట్రాల అభిప్రాయాలను ప్రధాని తెలుసుకోనున్నారు. ప్రజా రవాణా, కార్యాలయాలు, వ్యాపారాలు, పరిశ్రమల్ని.. ఎలా ప్రారంభించాలి వంటి అంశాలపై సీఎంలతో మోదీ చర్చించనున్నారు. అయితే.. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు లాక్డౌన్తో ఆర్థికంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో.. ఆంక్షల్నీ ఒకేసారి ఎత్తేయకుండా.. సడలింపులతో ముందుకు వెళ్లాలన్న అంశంపై.. ఓ నిర్ణయానికి రావచ్చని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com