మరోసారి తన ఉదారత చాటుకున్న నటుడు సోనూసూద్

ప్రముఖ నటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను నిరూపించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు తీసుకొని మరీ రవాణా సౌకర్యం కల్పించారు. వలస కార్మికుల కోసం మొత్తం 10 బస్సులు ఏర్పాటు చేశారు. థానే, గుల్బర్గా నుంచి బస్సులు బయలుదేరాయి. బస్సులు ఏర్పాటు చేయడంతోనే సోనూసూద్ ఆగిపోలేదు. స్వయంగా థానేలోని బస్టాప్ వద్దకు వెళ్లి మరీ ఏర్పాట్లను పరిశీలించారు. కార్మికులతో మాట్లాడి వారి గురించి ఆరా తీశారు.
వలస కార్మికుల కష్టాలపై సోనూసూద్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, వృద్ధుల కష్టాలు చూసి చలించిపోయానని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు తన కుటుంబంతో, ఇష్టమైన వారితో కలిసి ఉంటేనే బలంగా పోరాడగలడని సోనూసూద్ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికులకు సాయం చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సోనూసూద్ ఇటీవల పంజాబ్లోని వైద్యులకు 15 వందల వ్యక్తిగత సంరక్షక పరికరాల కిట్లు అందించారు. అలాగే, ముంబై జుహూలోని తన హోటల్ను వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు వసతులు కల్పించడానికి కేటాయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com