పేద ప్రజలను ఆదుకునేందుకు బుర్జ్ఖలీఫా వద్ద లైట్ల అమ్మకం
నిధులు సమకూర్చేందుకు వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టారు దుబాయ్లోని ఓ ఆర్గనైజేషన్ నిర్వాహకులు. కరోనా వల్ల జీవనాధారం కోల్పోయి, కనీస సౌకర్యాలు లేని వారిని ఆదుకునేందుకు ఆర్గనైజింగ్ బాడీ ద మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్లోబల్ ఇనిషియేటివ్స్ (ఎంబీఆర్జీఐ) విరాళాల సేకరణ ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా దాతలెవరైనా 10 దిర్హామ్ల విరాళం (ఒక భోజనానికి అయ్యే ఖర్చు) అందిస్తే ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా భవనం ముందు భాగంలో ఒక లైటు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు.
ఇప్పటి వరకు మొత్తం 12 లక్షల మంది విరాళాలు అందించడంతో 1.2 మిలియన్ల లైట్లు అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా 12 లక్షల లైట్లను వెలిగించి దాతల్లో స్ఫూర్తి నింపారు. 10 మిలియన్ల లైట్లు అమ్ముడు పోవాలని టార్గెట్గా పెట్టుకున్నామని అప్పుడే ఎక్కువ మందికి సహాయపడే వీలవుతుందని యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. కరోనా ఎఫెక్ట్తో దుబాయ్ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యాపారాలు పూర్తిగా కుప్పకూలిపోయాయి. కాగా, యూఏఈలో ఇప్పటి వరకు 19,881 కరోనా కేసులు నమోదవ్వగా 203 మంది మరణించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com