ఆకలి కేకలు.. ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

ఆకలి కేకలు.. ప్రమాదంలో ప్రజల ప్రాణాలు

కరోనా కంటే కూడా ఆకలి చాలా ప్రమాదకరమైనది.. లాక్‌డౌన్ ఎక్కువకాలం కొనసాగిస్తే ఆకలి చావులు పెరిగిపోతాయి.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి హెచ్చరికగా చెప్పిన మాటలు ఇవి. ఆ హెచ్చరికలు ఇప్పుడు నిజం అవుతున్నాయి. ఆఫ్రికా ఖండం ఆకలి కేకలతో మార్మోగిపోతోంది. అక్కడ అచ్చంగా ఆకలి రాజ్యమేలుతోంది. కరోనా కంటే వేగంగా ఆఫ్రికా దేశాలను ఆకలి కబళిస్తోంది. అభివృద్ధి పథంలో ఉన్న దేశాలు, అభివృద్ధి చెందని దేశాలు అనే తేడా లేకుండా అన్ని రాజ్యాల్లోనూ ఆకలే ప్రధాన సమస్యగా మారింది.

ఆఫ్రికా ఖండానికి చీకటిఖండం అనే ముద్ర ఉంది. ఆ మచ్చను చెరిపివేసుకుంటూ ఆఫ్రికా దేశాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఒక్కసారిగా కరోనా విరుచుకుపడింది. ఆ మహమ్మారి భయానికి ఆఫ్రికా మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. దేశాల మధ్య రాకపోకలే కాదు, సొంతదేశంలో గ్రామాలు, పట్టణాల మధ్య ట్రాన్స్‌పోర్ట్ పూర్తిగా నిలిచిపోయింది. దాంతో పరిస్థితి పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లైంది. అసలే అంతంతమాత్రం జీవితాలు. చాలా మంది దిగువ మధ్యతరగతి, పేదవర్గాలకు చెందినవాళ్లే. సొంత భూములు, సౌకర్యాలు కలిగినవాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండదు. దాంతో, పేదలు-బడుగు-బలహీనవర్గా ల బతుకులు బండబారిపోయాయి. తినడానికి తిండి లేక ప్రజలు అల్లాడిపోయారు. ఆకలి కేకలతో దేశాలు హోరెత్తిపోయాయి.

వాస్తవానికి ఆఫ్రికా ఖండంలోకి కరోనా ఆలస్యంగానే వచ్చింది. లేట్‌గా వచ్చినప్పటికీ అన్ని దేశాలను వేగంగా చుట్టేసింది. దాంతో ఆయా రాజ్యాలు వణికిపోయాయి. అస్సలే చాలా దేశాల్లో వైద్య సౌకర్యాలు, మెడికల్ ఫెసిలిటీస్ అంతంతమాత్రమే. పైగా, కరోనాకు వ్యాక్సిన్ గానీ, మందులు గానీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే ప్రజలు పిట్టల్లా రాలిపోతారని ప్రభుత్వాలు భయపడ్డాయి. దాంతో ఇతర ఖండాల కంటే ముందుగానే లాక్‌డౌన్‌ను అమలు చేశారు. రువాండా, టునీషియా, లిబియా, జింబాబ్వే, మడగాస్కర్, ఘనా దేశాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలుచేశారు. ఆఫ్రికాలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ఉన్న దక్షిణాఫ్రికాలో జన సంచారంపై కఠిన ఆంక్షలు విధించారు. నైజీరియా రాజధాని అబుజాతోపాటు లాగోస్ నగరంలో లక్షల మందిని కట్టేసినట్టుగా నిర్బంధాలు అమలుచేశారు.

ఆఫ్రికా దేశాల్లో ప్రజలకు మంచి ఇళ్లు కూడా ఉండవు. చిన్న డబ్బాల్లాంటి ఇళ్లల్లోనే ఎక్కువమంది నివసిస్తూ ఉంటారు. ఎక్కువమంది ఒకే చోట ఉండాల్సి రావడం, వారికి అవసరమైన ఆహారం, నిత్యా వసర వస్తువులు సరిగా అందకపోవడంతో పరిస్థితి విషమించింది. ఓ వైపు వ్యాధి భయం, మరోవైపు ఆకలి కేకలతో ఆఫ్రికన్లు అల్లాడిపోయారు. దాంతో ఆందోళనలు రాజుకున్నాయి. తినడానికి కాసింత తిండి పెట్టాలంటూ పోరుబాట పట్టారు. కడుపుమంటతో రగిలిపోయి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కొన్ని చోట్ల లూఠీలు, దొంగతనాలు కూడా జరిగాయి. షాపుల్లో దూరి తమకు కావాల్సిన వస్తువులను తీసేసుకున్నారు. కొంతమందికి ఇది దొంగతనంలా కనిపించినా అక్కడి వాళ్లకు మాత్రం అది ఆకలి సమస్య.

కరోనా భయంతో విధించిన నిషేదాజ్ఞలు ప్రజలకు పెనుశాపంగా మారాయి. అన్నం పెట్టాలంటూ ప్రజలు రోడ్లపైకి రావడంతో దేశాలకు దేశాలే అట్టుడికిపోయాయి. ఆరోగ్యం సంగతి తర్వాత ముందు ఆకలి తీర్చండి అంటూ ముక్తకంఠంతో నినదించారు. కెన్యాలో కఠిన ఆంక్షలపై ప్రజలు కన్నెర్ర చేశారు. పోలీసులు, సైన్యంపై తిరుగుబాట్లు జరిగాయి. రాజధాని నైరోబిలో ప్రజల ఆందోళనలు కాల్పులకు దారితీశాయి.

ప్రజల ఆందోళనలతో ప్రభుత్వాలు దిగివచ్చాయి. దక్షిణాఫ్రికాలో 45 రోజుల తర్వాత ఆంక్షలు సడలించారు. సెనెగల్, మారిటోనియా, గునియా, మాలే, ఐవరీకోస్ట్‌లలో రాత్రి కర్ఫ్యూను మాత్రమే అమలు చేస్తున్నారు. 10 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇథియోపియాలోనూ జన సంచారాన్ని నియంత్రించలేదు. ఐతే, ఇది మరో ఉత్పాతానికి దారి తీస్తోంది. లాక్‌డౌన్‌ను సడలించడంతో కరోనా వేగంగా విస్తరిస్తోంది. కేసులు భయంకరంగా పెరుగుతున్నాయి. పైగా, వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించడానికి అవసరమైన టెస్టింగ్ కిట్ల కొరత నెలకొంది. కరోనా బాధితులకు చికిత్స చేయడానికి కావాల్సిన మందులు కూడా లేవు. దాంతో ప్రభుత్వాలకు ముందు నుయ్యి, వెనక గొయ్యి పరిస్థితి ఏర్పడింది. ఈ విషమ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేయూతనందించింది. ఆఫ్రికా ఖండంలోని 25కు పైగా దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, పారాసిటమాల్, ఇతర మెడిసిన్స్‌ అందచేసింది.

ఇక, ఆఫ్రికా ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా బలమైన చర్యలు తీసుకోలేకపోయాయి. ఆసియా, ఐరోపా, అమెరికా ఖండాల్లో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలతో పోలిస్తే ఆఫ్రికా దేశాలు ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీలు నామమాత్రంగా ఉన్నాయి. అవి జనం అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. కెన్యాలో కొంతవరకు పన్నులు తగ్గించారు. మురికివాడలకు ఉచితంగా నీటి సరఫరా చేస్తున్నారు. సెనె గల్‌లో విద్యుత్తు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోంది. సంక్షోభం ముగిసేవరకు ఇళ్ల యజమానులు అద్దెలు వసూలు చేయవద్దని ఉగాండా అధ్యక్షుడు సూచించారు. లాగోస్, ఉగాండా, రువాండా, దక్షిణాఫ్రి కాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు పరిమితంగా ఆహారం పంపిణీ చేస్తున్నాయి.

కరోనా కారణంగా ఆఫ్రికాలో దాదాపు 33 లక్షల ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. ఈ ఏడాది చివరి నాటికి 2.9 కోట్ల నుంచి 4.4 కోట్ల మందికి కరోనా సోకే అవకాశముంది. ఇందులో దాదాపు 2 లక్షల మంది మరణించే ప్రమాదముంది. కరోనా దాడితో ఆఫ్రికా ఆర్థిక వ్యవస్థ 2.6 శాతం కుదించుకుపోనుంది. దాదాపు 3 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి వెళ్లనున్నారు. 150 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. కరోనా సంక్షోభం నుంచి బయటపడడానికి ఆఫ్రికాకు కనీసం 200 బిలియన్ డాలర్లు అవసరమని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మిగతా దేశాలతో పోలిస్తే బురిండీ, టాంజానియాల్లో పరిస్థితి సానుకూలం గానే ఉంది. ఇక్కడి ప్రభుత్వాలు సకాలంలో స్పందించి వైరస్ వ్యాప్తిని చాలావరకు తగ్గించగలిగాయి.

Tags

Read MoreRead Less
Next Story