మా చావేదో మేం ఛస్తంగదా.. ఎందుకు కొడతరు సారూ: వలస కూలీలపై విరిగిన లాఠీ

వలస కూలీలు వందల వేల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు చేరుకుంటున్నారు. చంకలో బిడ్డలు.. చేతిలో బ్యాగులు.. కాళ్లకు చెప్పులు లేవు.. కనుచూపు మేరలో ఆదుకునే నాధుడూ లేడు. వారి మానాన వారు నడుచుకుంటూ వెళుతుంటే పోలీసులు వారిపై లాఠీ ఝళిపించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. శుక్రవారం సాయింత్రం రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న కూలీలను గమనించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నివారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడినుంచి స్వస్థలాలకు పంపించమని అధికారులను ఆదేశించారు. దీంతో దాదాపు వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్కు తరలించారు. ఈరోజు ఉదయం అల్పాహారం తిన్న అనంతరం కూలీలు మళ్లీ కాళ్లకు పని చెప్పారు. సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధికి చేరుకోగానే పోలీసులు వారిని గుర్తించి అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీ ఛార్జి చేశారు. దాంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com