భీకరమైన గాలులు.. భారీ వర్షంతో.. అంఫన్ తుఫాను..

భీకరమైన గాలులు.. భారీ వర్షంతో.. అంఫన్ తుఫాను.. పశ్చిమ బెంగాల్లోని దిఘా.. బంగ్లాదేశ్లోని హతియా ద్వీపం మధ్య సుందర్బన్స్ ప్రాంతంలో తీరం దాటింది. బాంగాళాఖాతంలో ఈ మధ్యకాలంలో ఏర్పడిన తుఫాన్లలో అతి భయంకరమైనదిగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంఫన్ ప్రభావంతో.. డిఘా ప్రాంతంలో ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు కురిశాయి. సముద్రంలో అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఆరున్నర వరకు.. ఆంఫన్ తుఫాను తీరం దాటే ప్రక్రియ కొనసాగింది. తుఫాను తీరం దాటాక.. కనీసం నాలుగు గంటల పాటు ఆ ప్రభావంతో ఏకబిగిన భారీగా గాలులు వీస్తూ.. వర్షం కురిసింది. భీకర గాలులు... భారీ వర్షం .. తుఫాను కేంద్ర ప్రాంతం 30 కిలోమీటర్ల వ్యాసంలో విధ్వంసం సృష్టించింది.
తుఫాను ప్రభావానికి బెంగాల్ తీరంలో కురిసిన భారీ వర్షాలకు అనేక ఇళ్లు, భవనాలు, రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కూలాయి. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 170 కిలోమీటర్ల వేగంగా గాలులు వీచాయి. తుఫాను తీరం దాటినంత సేపు.. అదే పరిస్థితి కొనసాగింది.
ఆంఫన్ తుఫాను బలహీన పడటానికి ముందు.. తీరం దాటిన తర్వాత కూడా... గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. బెంగాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల నుంచి 5 లక్షల మందిని, ఒడిశా నుంచి లక్ష మందిని ఖాళీ చేయించిన సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈస్ట్ మిడ్నాపూర్, నార్త్ 24 పరగణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హూగ్లీ పరివాహక ప్రాంతంలో ప్రజల్ని ఖాళీ చేయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com