తల్లిని కలుసుకునేందుకు ఒంటరిగానే ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఐదేళ్ల బాలుడు
దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా రవాణా లేక ఎక్కడివారు అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అయితే లాక్డౌన్ 4.0లో ప్రజా రవాణాకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే రైళ్లు, బస్సులు నడుస్తుండగా, దేశీయంగా విమాన ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. దీంతో తన తల్లిని కలుసుకునేందుకు ఐదేళ్ల బాలుడు ఒంటరిగా... ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమాన ప్రయాణం చేశాడు. మూడు నెలల క్రితం ఢిల్లీ వెళ్లిన విహాన్ శర్మ.. లాక్డౌన్ కారణంగా అక్కడ చిక్కుకుపోయాడు. విమానాలు తిరిగి ప్రారంభంకావడంతో తన తల్లిని కలుసుకునేందుకు బెంగళూరు చేరుకున్నాడు. ప్రత్యేక కేటగిరీ ప్రయాణికుడిగా విహాన్కు అధికారులు అనుమతి ఇచ్చారు.
పాలబుగ్గల పసితనం ఇంకా వీడని ఐదేళ్ల ఈ బాలుడు.. బెంగళూరులోని కంపెగౌడ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. స్పెషల్ కేటరిగి కింద ఈ బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా.. జర్నీ చేశాడు. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో.. విహాన్ ప్రయాణానికి బంధువులు ఏర్పాట్లు చేశారు. ఈ బుడ్డోడికి మాస్క్, ప్లాస్టిక్ షీల్డ్, గ్లౌజులు తొడిగి భద్రంగా విమానం ఎక్కించారు. సిబ్బంది ఈ బాలుడికి సీట్ బెల్ట్ తగిలించి మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. అప్పటికే తమ కుమారుడి కోసం కళ్లకాయలు కాచేలా ఎదురు చూస్తున్న తల్లి.. బిడ్డ కనిపించగానే ఒడిలో తీసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com