అక్కడ 60 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు

పాకిస్థాన్ లో కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తోంది. పాజిటివ్ కేసులు 60 వేలకు చేరువగా ఉన్నాయి. గత 24 గంటల్లో పాకిస్తాన్లో 1,446 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయని, దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసులు 59,151 గా ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. ఇప్పటివరకు 19,412 మంది రోగులు కోలుకున్నారని తెలిపింది. అలాగేమరణించిన వారి సంఖ్య 1,225 కు చేరుకుంది. సింధ్లో అత్యధికంగా 23,507 కేసులు నమోదయ్యాయి, తరువాత పంజాబ్లో 21,118, ఖైబర్-పఖ్తుంఖ్వాలో 8,259, బలూచిస్తాన్లో 3,536, ఇస్లామాబాద్లో 1,879, గిల్గిట్-బాల్టిస్తాన్లో 638, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పోకె) లో 214 కేసులు నమోదయ్యాయి.
ఇప్పటివరకు 499,399 కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారని, గత 24 గంటల్లో 8,491 పరీక్షలు జరిగాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలావుంటే రోజుకు 30,000 పరీక్షలు నిర్వహించే సామర్థ్యం పాకిస్థాన్కు ఉందని అధికారులు పదేపదే చెబుతున్నప్పటికీ, ఈ ఘనత ఇంకా సాధించలేదు. గత రెండు రోజుల్లో పాక్ లో 10,000 కంటే తక్కువ పరీక్షలు జరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com