జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకే అవకాశం..

జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 31 నుంచి జూన్ 4 వరకు ఆగ్నేయ , తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ దృష్ట్యా, జూన్ 1 నుండి నైరుతి రుతుపవనాలు కేరళను తాకేలా పరిస్థితులు మారే అవకాశం ఉందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నైరుతి రుతుపవనాలు మాల్దీవులు-కొమొరిన్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకు, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలకు, అండమాన్ సముద్రం , అండమాన్ మరియు నికోబార్ దీవులలో మరింత ముందుకు వస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మాల్దీవులు-కొమొరిన్ ప్రాంతంలోని మరికొన్ని భాగాలలో రాబోయే 48 గంటలలో మరింత ముందుకు రావడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది.
ఇక పశ్చిమ-మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడనం ఏర్పడిందని.. ఇది రాబోయే 48 గంటల్లో అదే ప్రాంతంలో కేంద్రేకృతం అయ్యే అవకాశం ఉందని.. రానున్న 3 రోజుల్లో ఇది దక్షిణ ఒమన్ & తూర్పు యెమెన్ తీరం వైపు వాయువ్య దిశగా వెళ్ళే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో 2020 మే 29 నుండి 2020 జూన్ 1 వరకు పశ్చిమ-మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించవద్దని మత్స్యకారులను IMD హెచ్చరించింది. అంతేకాదు మత్స్యకారులు 2020 మే 31 నుండి 4 జూన్ 2020 వరకూ ఆగ్నేయం, తూర్పు-మధ్య అరేబియా సముద్రంలోకి ప్రవేశించవద్దని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com