దేశంలో మళ్లీ మొదలైన రైలు.. తొలికూత పెట్టిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్

దేశంలో మళ్లీ మొదలైన రైలు.. తొలికూత పెట్టిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్
X

దేశంలో రైలు బండి మళ్లీ కూతపెట్టింది. లాక్‌డౌన్‌తో రెండు నెలలకు పైగా షెడ్లకే పరిమితమైన రైళ్లు.. ఒళ్లు విరిచుకుని పట్టాలెక్కాయి. వలస కార్మికులను తరలించేందుకు.. నడుస్తున్న కొన్ని శ్రామిక్ రైళ్లు తప్ప.. రెండు నెలలుగా ఒక్క రెగ్యులర్ ట్రైన్ కూడా నడవలేదు. ఎట్టకేలకు లాక్‌డౌన్‌ సడలింపులతో రాజధాని రైళ్లు తప్ప.. దాదాపు మిగతా రైళ్లన్నీ పట్టాలెక్కాయి. జూన్ 1న తొలి రోజు దేశవ్యాప్తంగా రెండు వందల రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. లక్షా 45 వేల మంది తమ గమ్యస్థానాలకు వెళ్లనున్నారు.

అటు దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఎనిమిది రైళ్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ - న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ తొలి కూత పెట్టింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎనిమిది రైళ్లు నడుస్తున్నాయి. సచ్‌ఖండ్, దానాపూర్, గోల్కొండ, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా, రాయలసీమ, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లకు పట్టాలెక్కనున్నాయి. వీటితో పాటు.. దక్షిణ మధ్య రైల్వే పరిధి మీదుగా రాకపోకలు సాగించే దురంతో ఎక్స్‌ప్రెస్‌, హజ్రత్‌ నిజాముద్దీన్, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు కూడా సేవలందిస్తున్నాయి.

ఈ నెలాఖరు వరకు 25 లక్షల 82 వేల మంది రిజర్వేషన్‌ చేయించుకున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. భౌతిక దూరం నిబంధన నేపథ్యంలో కేవలం రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నారు. వెయిట్ లిస్ట్ జారీ చేసినా.. కేవలం రిజర్వేషన్‌ కన్ఫాం అయినవారిని మాత్రమే ఎంట్రీ కల్పిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ ఛార్జీలతోఏ టెక్కెట్లు విక్రయిస్తుండగా.. జూన్‌ 29 నుంచి తత్కాల్ బుకింగ్ కూడా మొదలవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. అటు సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో ఆహారశాలలను కూడా ఓపెన్ చేశారు. అయితే కేవలం పార్శిల్ సర్వీసులకు మాత్రమే అనుమించారు.

ఇక, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులకు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది రైల్వే శాఖ. ప్రయాణికులు 90 నిమిషాలకు మందే స్టేషన్‌కు రావాలనే నిబంధన విధించింది. అంతేకాకుండా, మాస్కులు ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. అటు స్టేషన్లలో భౌతిక దూరం పాటించేలా మార్కింగ్ చేశారు. ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అటు కరోనా అనుమానితుల కోసం ప్రతి రైళ్లో మూడు పీపీఈ కిట్లు అందుబాటులో వుంచారు. సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు.. రైళ్లు ఆగే అన్ని స్టేషన్లలో తగిన ఏర్పాట్లు చేసింది రైల్వే శాఖ.

Tags

Next Story