చిత్తూరు జిల్లాలో 'డాక్టర్ సుధాకర్' తరహా వేధింపుల ఘటన

దళిత మహిళ అయిన తనను వైసీపీ నేతలు నిర్బంధించి.. వేధించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ప్రభుత్వ వైద్యురాలు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రెండు నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ పట్టించుకోలేదంటూ బాధితురాలు డాక్టర్ అనితారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి నియోజకవర్గమైన.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని పెనుమూరు వైద్యశాలలో వైద్యురాలిగా అనితారాణి పని చేస్తున్నారు. అక్కడే ఇలా జరగడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత వైద్యురాలికి వేధింపులపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. వేధింపులకు సంబంధించి బాధితురాలి ఆడియోను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గానికీ రక్షణ లేకుండా పోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో.. డాక్టర్ వేధింపులకు గురైన విషయం ఒక్కసారిగా బయటకు వచ్చింది.
గ్రామీణప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉద్యోగం వచ్చినా కాదనుకుని పెనుమూరులో పనిచేస్తున్నానని అనితారాణి అంటున్నారు. హాస్పిటల్లో దిగువస్థాయి సిబ్బంది అవినీతి ప్రశ్నించడమే తన తప్పయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చ్ 22న తనను హాస్టల్ గదిలో బంధించి, స్థానిక వైసీపీ నేతలను పిలిపించి తనను బెదిరించారని అన్నారు. దీనిపై కేసు పెట్టినా ఇంత వరకూ బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

