తప్పంతా భారత్ దే అన్నట్టు చైనా మొండివాదన

చైనా కయ్యానికి కాలుదువ్వుతూనే ఉంది. ఓ వైపు ఉద్రిక్తతల నివారణకు సైనిక అధికారుల చర్చలు జరుపుతున్నప్పటికీ.. తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడంలేదు. గల్వాన్ లోయలో చైనా సైనిక బలగాల మోహరింపు, నిర్మాణాలు ప్రస్తుతం అత్యంత ప్రాధాన్యత అంశమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నొక్కిచెప్పింది. చైనీయుల మోహరింపు, దుందుడుకు స్వభావం జూన్ 6న చేసుకున్న ఒప్పందానికి విరుద్ధమని తెలిపింది. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితికి కట్టుబడి ఉండాలని... మార్పులు చేయకూడదని రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాన్ని డ్రాగన్ కంట్రీ ఎప్పుడు లక్ష్య పెట్టలేదని భారత్ వ్యాఖ్యానించింది.
లద్దాఖ్ సమీపంలోని గల్వాన్ లోయలో... భారత్, చైనా సైనికుల ఘర్షణ తర్వాత... ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు దేశాల సైనిక, దౌత్యస్థాయి చర్చలు జరుపుతున్నాయి. ఇందులో విదేశాంగ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక పక్క చర్చలు జరుపుతున్న చైనా... మరోవైపు తప్పంతా భారత్ దే అన్నట్టు మొండివాదనకు దిగుతోంది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్న చైనాకు.. అదే రీతిలో సమాధానం చెప్పేందుకు భారత్ కూడా రెడీ అవుతోంది. ఈ మేరకు 3 వేల 488 కిలోమీటర్ల మేర వాస్తవాధీన రేఖ వెంట భారత్ కూడా సైన్యాన్ని తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇండియన్ ఆర్మీతోపాటు... ఇండో-టిబెట్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ను కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మిలిటరీ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ పరమ్జిత్ సింగ్, ఐటీబీపీ చీఫ్ ఎస్.ఎస్.దేస్వాల్లు శనివారం లేహ్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
జాతీయ భద్రతా మండలికి అందిన నివేదికల ప్రకారం... సరిహద్దుల్లోని గల్వాన్ లోయ, హాట్స్ప్రింగ్, పాంగాంగ్ లేక్ మూడు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. అయితే భారత్ మాత్రం ఏప్రిల్ 30, 2020 నాటి యథాస్థితిని పునరుద్ధరించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని మోల్డోలో జరిగిన సైనిక జనరల్స్ చర్చల్లో భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు గల్వాన్ లోయ, గోగ్రాలోని గస్తీ పాయింట్లు 14,15,17 వద్ద బలగాలను తగ్గించాలని రెండు వర్గాలు సరస్పరం కోరినట్టు తెలుస్తోంది.
అయితే చైనా పైకి శాంతి అంటూ జపిస్తున్నా.... బుధవారం నాటి శాటిలైట్ చిత్రాల్లో... మాత్రం... గల్వాన్ లోయలోకి 14 నంబర్ గస్తీ పాయింట్ వద్ద చైనా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నట్టు కనిపిస్తోంది. దాంతోపాటు గస్తీ పాయింట్ 15 వద్ద భారీగా టెంట్లు వేసి తిష్టవేశాయి. అలాగే గస్తీ పాయింట్ 17 వద్ద పెద్ద ఎత్తున చైనా బలగాలను మోహరించినట్టు సమాచారం. తాజాగా పాంగాంగ్ సరస్సు వద్ద పరిస్థితులకు సంబంధించి అందిన నివేదిక ప్రకారం చైనా బలగాలు ఫింగర్ 4 వరకు వచ్చినట్టు తెలుస్తోంది. చైనాతో భారత్ సైనిక, ద్వైపాక్షిక మార్గాల ద్వారా చర్చలు జరుపుతున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందుస్తు సన్నద్ధత చేస్తున్నారు.
భారత్, చైనా సైన్యాలు ఘర్షణ పడ్డ గల్వాన్ లోయలో సైనిక బలగాలు వెనక్కి మరలినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో డ్రాగన్ సైనికలు, వాహనాల సంఖ్యలో తగ్గుదల ఉన్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం... చైనా ఆర్మీ... అంతకుముందుతో పోలిస్తే... కిలోమీటర్ వెనక్కి వెళ్లిపోయింది. LAC వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల అత్యున్నత సైనిక, దౌత్య సమావేశాల తర్వాత... చైనీయులు కొంత వెనక్కి తగ్గడం ఇదే తొలిసారి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com