ఒకరి నుంచి 104 మందికి..

ఎన్నాళ్లని భయపడతాం.. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం.. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది.. బయటకు వెళ్తే భయపడాల్సి వస్తుంది. కరోనా ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియట్లేదు.. ఒకరికి వచ్చిందంటే వంద మందికి వచ్చేస్తుంది. తాజాగా తమిళనాడు తిరుచ్చిలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ లోని ఓ ఆభరణాల దుకాణంలో పని చేసే వ్యక్తికి జూన్ 22న పాజిటివ్ అని వచ్చింది. దీంతో అతడితో పాటు దుకాణంలో పని చేసి 300 మందిని, వారి కుటుంబ సభ్యులను పరీక్షించగా అందులో 104 మందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరంతా తురైయూర్, తాలూకాల గ్రామాలకు చెందిన వారని అధికారులు వెల్లడించారు.
దీంతో కేవలం 13 రోజుల్లోనే రెండు గ్రామాల్లో కరోనా కేసులు 10 రెట్లు పెరిగాయి. జూన్ 22 వరకు 10 కరోనా కేసులు ఉంటే ఆ సంఖ్య కాస్తా ఇప్పుడు 108కి చేరుకుంది. నలుగురు మినహా అందరూ జ్యువెలరీ షాపుకి సంబంధించిన వారే. దుకాణంలో మొట్ట మొదటి కేసు పాజిటివ్ అని తెలిసినా మిగతా సిబ్బందిని క్వారంటైన్ కు పంపించకుండా విధులకు హాజరవమనడంతో కేసులు పెరిగాయని అంటున్నారు. దీంతో ఆ దుకాణం చుట్టు పక్కల షాపులని రెండు రోజులు మూసి ఉంచాలని ఆదేశించారు అధికారులు. ఆ ప్రాంతాన్ని హాట్ స్పాట్ గా ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com