కరోనా ఎఫెక్ట్.. ఢిల్లీలోని రైల్ భవన్ మూసివేత

దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. ఢిల్లీలోని రైల్ భవన్ లో కరోనా వైరస్ కలకలం రేపింది. జులై 9, 10,13 తేదీల్లో రైల్వే బోర్డు.. తమ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించింది. స్పెషల్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ క్యాంపును నిర్వహించి.. ఉద్యోగులకు పరీక్షలు చేశారు.
అయితే ఈ కరోనా పరీక్షల్లో పలువురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో రైల్ భవనాన్ని 14,15 తేదీల్లో మూసివేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ రెండు రోజుల పాటు భవనాన్ని మొత్తం శానిటైజ్ చేయనున్నారు. ఉద్యోగులందరూ ఈ రెండు రోజులు ఇంటి నుంచే పని చేయాలని బోర్డు సూచించింది.
కాగా, ఢిల్లీలో ఇప్పటి వరకు 1,13,740 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 3,411 మంది మరణించారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 19,017 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా మహమ్మారి బారి నుండి 91,312 మంది కోలుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com