కారులో మంటలు చెలరేగి ఎస్బీఐ ఉద్యోగి మృతి..

కారులో మంటలు చెలరేగి ఎస్బీఐ ఉద్యోగి సజీవదహనమయ్యారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్ ప్లాజా సమీపంలో జరిగింది. ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి నంద్యాల నుంచి హైదరాబాదుకు కారులో వస్తున్నారు. నంద్యాల సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. దీంతో కారు కంటైనర్ లో ఇరుక్కుపోయింది. ప్రమాదాన్ని కంటైనర్ డ్రైవర్ గమనించకపోవడంతో కారును సుమారు 3 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.
ఈ క్రమంలో నంద్యాల మండలం చాపిరేవుల టోల్ ప్లాజా వద్ద కారులో మంటలు చెలరేగాయి. శివకుమార్ (40) దివ్యాంగుడు కావడంతో కారులో నుంచి బయటకు రాలేక సజీవదహనమయ్యాడు. అతడి స్నేహితులు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, శివకుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల మండలం.. నంద్యాల ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com