రాజధాని రగడ.. హైకోర్టు తాజా ఉత్తర్వులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు యథాతథ స్థితి విధించింది. ఈ నెల 27 వరకు స్టేటస్ కోను న్యాయస్థానం పొడిగించింది. కరోనా సమయంలో అంత అర్జెంట్ ఏముందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దానికి స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది రాకేష్ త్రివేది.. ప్రభుత్వానికి విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అవసరం అయితే కేసును వాయిదా వేయండి కానీ స్టేటస్ కోను పొడిగించవద్దని హైకోర్టును త్రివేది కోరారు. స్టేటస్ కోతో క్యాంప్ కార్యాలయం తరలించే అవకాశం లేకుండా పోయిందని ఇందుకు కోర్టు ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని ఆయన అన్నారు. ఈ ఉత్తర్వులతో చట్టాలను అమలు చేసే అవకాశం లేకుండా పోయిందని త్రివేది వాదించారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ వాదనను పిటిషనర్ తరపు న్యాయవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టాన్ని ఉల్లంఘించినందునే తాము స్టేటస్ కో అడిగామని దాన్ని ఎత్తివేయడానికి వీల్లేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. మూడు రాజధానుల ఏర్పాటు విభజన చట్టానికి విరుద్ధంగా ఉందని న్యాయవాదులు చెప్పుకొచ్చారు. విభజన చట్టంలో కేవలం ఒక్క రాజధాని ప్రస్తావనే ఉందని అన్నారు. ప్రత్యక్ష పద్ధతిలో విచారణ చేపట్టిన అనంతరం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు స్టేటస్ కోను ఈ నెల 27వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com