దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు 74వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. యావత్ ప్రపంచం ముందు ఉన్న ఏకైక శత్రువు కరోనా మహమ్మారి అని అన్నారు. ఈ మహమ్మారితో ముందుండి పోరాటం చేస్తున్న కరోనా వారియర్స్ కు దేశం రుణపడి ఉందని అన్నారు. ఈ కరోనా ప్రజల జీవనస్ధితిగతులను మార్చేసిందని అన్నారు. ఈ విపత్కర పరిస్ధితుల్లో కేంద్రం పలు పధకాల ద్వారా ప్రజలకు సాయం చేసిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి పరిస్థితులను అదుపులో ఉంచాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి స్ధానిక పరిస్ధితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంతో కరోనా ప్రభావాన్ని కొంతమేర కట్టడి చేయగలిగామని చెప్పారు. ప్రభుత్వాల పనితీరుతో కరోనా మరణాలను చాలా వరకు తగ్గించామని అన్నారు. ఈ విషయంలో ప్రపంచం మొత్తం భారత్ ను ప్రశంసించిందని గుర్తు చేశారు. వందేభారత్ మిషన్ ద్వారా విదేశాల్లో చిక్కుకున్న పది లక్షల మంది స్వదేశానికి చేరకున్నారని తెలిపారు. ప్రజారోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన మార్పులకు శ్రీకారం చుడుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com