ధోనీ రిటైర్మెంట్.. భార్య సాక్షి భావోద్వేగం

ధోనీ రిటైర్మెంట్ సడెన్ గా అనుకున్నది కాకపోయినా అభిమానులను మాత్రం కలచివేసింది. శనివారం సాయింత్రం తాను పదవీ విరమణ చేసినట్లు ప్రకటించగానే పలువురు ఉద్విగ్నతకు లోనయ్యారు. ప్రతి ఇంటా ఒకరు కన్నీరు కార్చారు. తమ ఆప్తుడు, ఎంతగానో అభిమానించే క్రికెటర్ ధోని ఇకపై అంతర్జాతీయ క్రికెట్లో ఆడడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత పలువురు స్పందించారు. కొందరు ఆయనతో నడిచిన నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానులతో పాటు ధోనీ సహచర క్రికెటర్లు అతడితో తమకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
ఇక ధోనీ సతీమణి సాక్షిసింగ్ కూడా స్పందించారు. దేశం గర్వపడేలా ధోనీ ఎన్నో విజయాలు అందించారని సాక్షి ఇన్ స్టాలో పేర్కొన్నారు. మీరు సాధించిన విజయాలు చూసి గర్వంగా ఉంది. రిటైర్మెంట్ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలు చూసి నేను గర్విస్తున్నాను. మీకు ఇష్టమైన ఆటకు గుడ్ బై చెప్పే క్రమంలో పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకుని రిటైర్మెంట్ ప్రకటించారని అనుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమోకాని, వాళ్లకు మీరు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు అని సాక్షి పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com