భద్రాచలం వద్ద పెరిగిన గోదావరి నీటిమట్టం.. మూడో ప్రమాద హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద మూడో హెచ్చరికను దాటి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఆరేళ్ల తరువాత మూడో ప్రమాదహెచ్చరికను జారీ చేశారు అధికారులు. 2014 సెప్టెంబర్ 8న ఇక్కడ 56.1 అడుగులకు నీటిమట్టం చేరింది. గోదావరి వరద ఉధృతికి లోతట్టు ప్రాంతాలైన చర్ల, దుమ్ముగూడెం వాసులకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలకు ముంపు పొంచి ఉంది. మరోవైపు ముంపు కారణంగా వేలాది ఎకరాల్లో పంటకు అపార నష్టం వాటిల్లింది.
వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఖమ్మం నుంచి భద్రాచలం వైపుకు రాకపోకలను అధికారులు అదుపు చేస్తున్నారు. భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు రద్దు చేశారు. ఇక ఏజెన్సీ ప్రాంతాలకైతే రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు అధికారులు. ముఖ్యమంత్రి కేసీఆర్ వరదల పరిస్థితిపై ఈ రోజు మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com