రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్కు తిరస్కరణ మొదలైందని.. లోక్సభ ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు రాసిన బహిరంగ లేఖలో రేవంత్ విమర్శలు గుప్పించారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రశ్నించే గొంతుకకు ప్రజలు పట్టం కట్టారన్నారు. సిద్దిపేట, సిరిసిల్లలో మెజార్టీలు తగ్గడం టీఆర్ఎస్ పతనానికి సంకేతమన్నారు రేవంత్. కరీంగనర్, నిజామాబాద్లో నేతలు ఓటమిపాలయ్యారని.. పార్టీ గ్రాఫ్ వేగంగా పడిపోతోందనడానికి ఇదే సంకేతమన్నారు…
ఏ రాజకీయ పార్టీకైనా వర్తమానంలో ప్రజల ఆదరణ ఎలా ఉందన్నదే ప్రామాణికమన్న రేవంత్.. ఐదు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కాదని ఐదేళ్ల క్రితం ఎన్నికల ఫలితాలతో పోల్చుకోవడం మీ అతి తెలివికి నిదర్శనమంటూ కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చరిత్ర చెప్పుకోవాలనుకుంటే ఎవరి ఘనత ఏ పాటిదో చర్చ పెట్టుకుందామని సవాల్ విసిరారు. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమిని గుర్తు చేశారు. మల్కాజ్ గిరిలో తన గెలుపుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గురివింద సామెతను గుర్తు చేస్తున్నాయని రేవంత్ లేఖలో ఎద్దేవా చేశారు.