ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తొలిసారి హైదరాబాద్లో గవర్నర్ సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకున్న జగన్ ఇఫ్తార్ విందుకు హాజరయ్యేందుకు నేరుగా రాజ్భవన్కు చేరుకోగా.. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకొని గవర్నర్తో భేటీ అయ్యారు. ఇఫ్తార్కు రెండు గంటల ముందే గవర్నర్ దగ్గరికి వెళ్లిన ముఖ్యమంత్రులు ఇద్దరు విభజన అంశాలపైనే ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలు, సంస్థల విభజన తదితర అంశాలపై పరిష్కారం కోసం చాలాసేపు చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఇరు రాష్ట్రల అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి.. సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలన్నింటినీ సానుకూల వాతావరణంలో పరిష్కరించుకోవాలన్నది రెండు రాష్ట్రాల సీఎంల ఆలోచన. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉండటంతో ఆయా భవనాల అప్పగింత, రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన, విభజన చట్టంలోని 9, 10 షెడ్యూల్లోని అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
రాజ్భవన్లో గవర్నర్తో పాటు కేసీఆర్, జగన్ ఆశీనులయ్యే సమయంలో ఇరువురి మధ్య సరదా సన్నివేశం కనిపించింది. గవర్నర్ పక్కన ఉన్న కుర్చీలో మీరు కూర్చోండంటే మీరు కూర్చోండంటూ ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకున్నారు. జగన్ను చేయి పట్టుకుని మరీ తీసుకెళ్లి గవర్నర్ పక్క సీటులో కేసీఆర్ కూర్చోబెట్టారు.