విద్యార్ధులు భవిష్యత్లో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తోడ్పడాల్సిన విశ్వవిద్యాలయాలు వేధింపులకు కేంద్రంగా మారుతున్నాయి. వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. రోహిత్ వేముల, పాయల్ సల్మాన్ తాడ్వి లాంటి ఎందరో విద్యార్థులు ఇలాంటి వేధింపులకు బలైనవారే. వీరి ఘటనలను మరవక ముందే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటక ధర్వాడాకు చెందిన ఓంకార్ హరియాణాలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్లో పీడియాట్రిక్స్లో ఎండీ చేస్తున్నాడు. ఈ క్రమంలో అతని సోదరికి వివాహం నిశ్చయమయ్యింది. ఆ వేడుకకు వెళ్ళేందుకు సెలవు ఇవ్వాల్సిందిగా హెచ్వోడీని కోరాడు. ఓంకార్కు సెలవు ఇవ్వడానికి హెచ్వోడీ ఒప్పుకోలేదు. అకడమిక్ విషయంలో కూడా తనను వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్థాపం చెందిన ఓంకార్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఓంకార్ ఆత్మహత్యకు హెచ్ఓడీ వేధింపులే కారణమని అతని స్నేహితులు చెబుతున్నారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంపస్ చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంబరాలు జరాగాల్సిన ఆ ఇంట్లో ఈ సంఘటనతో విషాదం నెలకొంది. కొడుకు మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.