తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు బలపడ్డాయి. రుతు పవనాలకు ఉపరితల ఆవర్తనం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, పంజాగుట్టలో కురుస్తున్న కుండపోత వానతో రోడ్లపై భారీగా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామైంది.
జార్ఖండ్, చత్తీస్గఢ్ పరిసరాల్లో అల్పపీడనం ఆవరించింది. ప్రస్తుతం రాజస్థాన్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. చురుగ్గా కదులుతున్న నైరుతి రుతు పవనాలు... తెలంగాణను పూర్తిగా ఆవరించాయి. అయితే కోస్తాంధ్ర మీద మాత్రం రుతు పవనాల ప్రభావం సాధారణంగా ఉంది. దీంతో కోస్తా జిల్లాల్లో వర్ష తీవ్రత తగ్గింది. రుతు పవనాల ప్రభావంతో నేడు, రేపు సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
గడిచిన 24 గంటల్లో అద్దంకిలో 8 సెంటీ మీటర్లు, ప్రకాశం జిల్లా కంభంలో 7 సెంటీ మీటర్లు, చింతపల్లి, బెస్తవారి పేట, వెలివెన్నులో 5 సెంటీ మీటర్లు, యలమంచిలి, పోలవరంలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.