ప్రధానమంత్రి నరేంద్రమోడీ- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరగనున్న నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. ఇటీవల అమెరికాకు చెందిన 29 ఉత్పత్తులపై అదనపు కస్టమ్స్ డ్యూటీ విధించింది భారత్. బాదం, వాల్నట్, దినుసులపై ఈ సుంకాలు విధించింది. కొద్ది నెలల క్రితమే పెంచాల్సి ఉన్నా.. అమెరికా విజ్ఞప్తులతో గడువు పెంచుకుంటూ వచ్చింది. చివరకు సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16 నుంచి కొత్త పన్నుల విధానం అమల్లోకి వచ్చింది.
భారత్ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా అసంబద్దమని.. ట్విట్టర్ లో పేర్కొన్నారు. వెంటనే పెంచిన పన్నులు తగ్గించాలని మోదీకి సూచించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పంపియో భారతదేశ పర్యటనలో ఉండగానే ఈ నిర్ణయం వెలువడింది. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశం సందర్భంగా మైక్ ఈ అంశం చర్చించినట్టు తెలుస్తోంది.
జి-20 సదస్సులో భాగంగా మోదీ- ట్రంప్ శుక్రవారం ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. దీంతో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. గత కొంతకాలంగా ఇరుదేశాల మధ్య ట్రేడ్ వార్ జరుగుతోంది. గతంలోనే అమెరికా ఉత్పత్తులపై పన్నులు పెంచుతామని భారత్ ప్రకటించింది. నిర్ణయం తీసుకుంటే భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులను అడ్డుకుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వచ్చారు. అంతేకాదు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే వ్యూహాత్మక భాగస్వామి హోదాను రద్దు చేస్తామని ప్రకటించారు. మరి మోదీ- ట్రంప్ చర్చల్లో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయో చూడాలి.