ఢిల్లీలో మెట్రో, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న కేజ్రీ సర్కారు ఆశలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. ఉచిత ప్రయాణంపై లోక్సభలో ఓ ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపాదన తమకు రాలేదని కేంద్ర మంత్రి చెప్పారు. ఉచిత ప్రయాణం కల్పించాలన్న ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదన్నారు. దీనిపై ఆప్ స్పందించింది. ఢిల్లీ మెట్రోలో తమకు 50 శాతం వాటా ఉన్నదని, మహిళలకు ఉచిత ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆమ్ ఆద్మీ పేర్కొంది.
ఏడాది చివర్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల జరుగునున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకుని పలు పథకాలకు శ్రీకారం చుడుతోంది ఆప్ ప్రభుత్వం . దీనిలో భాగంగానే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. వెంటనే అమలు చేస్తామని కూడా చెప్పారు. అయితే తాజాగా ఈ ప్రతిపాదనను కేంద్ర తిరస్కరించడంతో కేజ్రీవాల్ సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.