పాము ప్రాణం తీసింది. సర్పాన్ని మెడలో వేసుకుని ప్రదర్శిస్తున్న ఆ వ్యక్తికి.. అదే అతని పాలిట యమపాశమైంది. ఈ సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం కంకేర్ జిల్లాలోని పంకజుర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. బేనిరామ్ అనే పాములు పట్టే వ్యక్తి వివిధ ప్రాంతాలు తిరుగుతూ వాటితో ప్రదర్శన నిర్వహిస్తుండేవాడు.
ఈ క్రమంలో బుధవారం పంకజుర్ ప్రాంతంలో పాములతో ప్రదర్శన నిర్వహించాడు. ఆ ప్రదర్శనలో భాగంగా సురేష్ మండల్ అనే వ్యక్తి విషపూరితమైన పామును మెడకు చుట్టాడు. అనుకోకుండా మెడకు చుట్టిన పాము సురేష్ను కాటు వేసింది. ఈ క్రమంలో విషం అతని ఒంట్లోకి చేరడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ప్రేక్షకులంతా చూస్తుండగానే ఇదంతా జరిగింది. సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడంతో అతన్ని లేపడానికి అక్కడివారు ప్రయత్నించారు. కానీ ఆలోపే సురేష్ మృతిచెందాడు. దీంతో అక్కడున్న వారు బేనిరామ్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.