తమిళనాడు తలైవా రజనీకాంత్ కుమార్తె సౌందర్య ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆమె చేసిన ఓ ట్వీట్ ఇందుకు కారణమైంది. చెన్నైలో కొంతకాలంగా తాగునీరు అందక జనం ఛస్తున్నారు. కంపెనీలు కూడా మూతపడేందుకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన కుమారుడికి స్విమ్మింగ్ నేర్పిస్తూ సౌందర్య రజనీకాంత్ ఓ ఫోటో ట్విట్టర్లో పెట్టారు. పిల్లలకు ఈత నేర్పితే.. వాళ్లు చాలా ఫిట్గా, యాక్టివ్గా ఉంటారంటూ ఉచిత సలహా ఇచ్చారామె.
రజనీకాంత్ కూతురు సౌందర్య ట్వీట్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఓ పక్క చెన్నైలో తాగడానికి చుక్కనీరు లేక ప్రజలు అల్లాడుతుంటే.. స్విమ్మింగ్ చేయడానికి నీరు కావాలా.. అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఫ్యాన్స్ ఆగ్రహం సౌందర్యను బలంగానే తాకింది. ట్విట్టర్లో షేర్ చేసిన ఫోటోను ఆమె వెంటనే తొలగించారు. చెన్నైలో నీటి కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని నేను పెట్టిన పోస్ట్ను తొలగిస్తున్నట్టు చెప్పారామె. పిల్లలకు వ్యాయామం నేర్పాలని చెప్పడమే తన ఉద్దేశమని.. నీటిని కాపాడుకుందామని ఫినిషింగ్ ఇచ్చారు.