సోషల్ మీడియాను మంచికి వాడుకుంటే పేరొస్తుంది. అలా కాదని చెడు కోసం వాడితే జైలుపాలే! ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాతో....యువతుల్ని, మహిళలను ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఓ కేటుగాడిని కటకటాల వెనక్కి పంపారు సూర్యాపేట పోలీసులు.
యానంకు చెందిన సతీష్ చంద్ర అనే యువకుడు....రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లాంటి ... సోషల్ మీడియాలో పట్టుంది. అందమైన యువతులు, మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టేవాడు. వారితో పరిచయం పెంచుకునే వాడు.
ఇలా సూర్యాపేటకు చెందిన ఓ యువతి సైతం...... సతీష్ చంద్ర ట్రాప్లో పడింది. అతని మాయమాటలకు పూర్తి లొంగిపోయింది. దీంతో తరుచూ యానం నుంచి సూర్యాపేటకు వచ్చేపోయేవాడు సతీష్ చంద్ర. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కారు కొనేందుకు డబ్బులు కావాలని అడిగాడు. దీంతో ఇంట్లో దాచి పెట్టిన 24 తులాల బంగారు నగల్ని సతీష్ చంద్రకు ఇచ్చేసిందా యువతి. కొన్ని రోజుల తర్వాత... అతడి బండారం బైటపడింది. ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. తనతో జరిపిన చాటింగ్, ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడు.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి .... జరిగిన విషయాన్ని తన తాతకు చెప్పింది. తాత సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలో దిగిన.... పోలీసులు సతీష్ చంద్రను యానంలో అరెస్ట్ చేశారు. మొత్తం బంగారాన్ని రికవరీ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. సోషల్ మీడియాలో ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా యువతులు, మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు పోలీసులు.