వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధి దగ్గర తనయుడు సీఎం జగన్ నివాళులర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఇడుపులపాయకు వెళ్లిన జగన్.. వైఎస్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. జగన్తో పాటు వైఎస్ విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి వైఎస్ షర్మిల పూల మాలలు వేసి.. రెండు నిమిషాలు మౌనం పాటించారు. క్రైస్తవ పద్ధతిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తరువాత ఘాట్ ప్రాంగణంలో ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ప్రస్తుతం సీఎం జగన్ ఇడుపులపాయలో పర్యటిస్తున్నారు. గండి ఆంజేనేయస్వామిని దర్శించుకున్న ఆయన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇడుపలపాయ పర్యటన ముగిసిన తరువాత.. జమ్మలమడుగులో నిర్వహించే కార్యక్రమంలో పెరిగిన పింఛను పంపిణీని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 12 రకాల పింఛన్లను లబ్ధిదారులకు ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. ఈ రోజును రైతు దినోత్సవంగా ప్రకటించిన సీఎం జగన్.. జమ్మలమడుగు సభలో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టున్నారు.