ఏదైతే దురదృష్టంగా భావిస్తామో అదే కొన్ని సార్లు అదృష్టంగా మారుతుంది. ముంబైకి చెందిన దనిష్ అనే యువకుడికి వచ్చిన అనారోగ్యమే అతని ప్రాణాలు కాపాడింది.ముంబై డోంగ్రీ ప్రాంతంలో తండేల్ వీధిలోని వందేళ్ల క్రితం నాటి నాలుగు అంతస్తుల కేసర్బాయి భవనం మంగళవారం ఉదయం కుప్ప కూలింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా మరో 40 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ భవనంలోనే దనిష్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రక్త పరీక్ష కోసం మంగళవారం ఉదయం ఆస్పత్రికి వెళ్లాడు. దనిష్ ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో దనిష్ కుటుంబ సభ్యులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. భవనం కుప్పకూలిన సమయంలో అక్కడ లేకపోవడంలో అతను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అనారోగ్యమే దనిష్ ప్రాణాలు కాపాడింది అంటున్నారు స్థానికులు.