ఆందోళన చేస్తున్న ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పరమేష్పై వేటు పడింది. ఈ ఘటనపై విచారించిన సీపీ అంజనీ కుమార్.. కానిస్టేబుల్ పరమేష్ను సస్పెండ్ చేశారు. బుధవారం చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ తరలించొద్దని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేసిన ఆందోళనలో.. కానిస్టేబుల్ పరమేష్ పోకిరీ పని చేస్తూ కెమెరాకు చిక్కాడు. నిరసన తెలుపుతున్న విద్యార్థినులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న క్రమంలో.. మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ పరమేష్ స్టూడెంట్ను గట్టిగా గిల్లాడు. ఆ నొప్పి భరించలేక అమ్మాయి గట్టిగా అరిచేసింది. అంతే కాదు బూటు కాలుతో ఆమెను తొక్కాడు.
కానిస్టేబుల్ పరమేష్ వెకిలి చేష్టలు వీడియోలో రికార్డు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నాతాధికారులు.. విచారణ చేసి పరమేష్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై యునాని ఆస్పత్రి డైరెక్టర్ వర్షిణి స్పందించారు. ఏసీపీ వల్లే తాను బయటపడ్డానని.. పోలీసులు తనను క్షేమంగా పంపించారని తెలిపారు. ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదని పోలీస్ ఉన్నతాధికారులతో చెప్పారు.