పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా

Update: 2019-08-17 07:44 GMT

కశ్మీర్‌ వ్యవహారంలో భారత్‌పై అక్కసు వెల్లగక్కుతున్న పాకిస్తాన్‌కు అమెరికా మరో పెద్ద షాక్‌ ఇచ్చింది. అప్పుల ఊబితో కూరుకుపోయి సతమతమవుతున్న ఆదేశానికి ఇచ్చే ఆర్థిక సాయంలో కోత విధించింది.. గతంలో ఇస్తామన్న దాంట్లో 4.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే సాయం అందిస్తామని ట్రంప్‌ సర్కార్ స్పష్టం చేసింది. 440 మిలియన్‌ డాలర్ల మేర కోత పెట్టినట్లు వెల్లడించిండి .

పాక్‌కు అందించే ఆర్థిక సాయంలో అమెరికా కోత విధించడం ఇది తొలిసారి కాదు. ఉగ్రవాదంపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో 1 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని కోతపెట్టింది. అదే ఏడాది సెప్టెంబరులో మరో 300 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని కూడా తగ్గించింది.

తమ నుంచి పాక్‌ ఆర్థికసాయం పొందుతున్నా.. తమకు ఎలాంటి సాయం చేయట్లేదని అందుకే ఆర్థిక సాయాన్ని తగ్గిస్తున్నామని గతంలోనే ట్రంప్‌ పేర్కొన్నారు.. ఉగ్రవాద వ్యతిరేక పోరుకోసం అంటూ నిధులు పొందుతున్న పాక్‌.. ఉగ్రవాదులుపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తమను వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సాయంలో కోత విధిస్తూ వస్తోంది ట్రంప్‌ సర్కార్.

అటు కశ్మీర్‌ వ్యవహారంలో అమెరికా నుంచి పాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి సమావేశంలో తమకు మద్దతివ్వాలని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఫోన్‌ ద్వారా సంప్రదించారు. అయితే ఇందుకు నిరాకరించిన ట్రంప్‌.. ఈ సమస్యను భారత్‌-పాక్‌ ద్వైపాక్షికంగా చర్చించుకోవాలని సూచించారు.

Similar News