ఏపీలో పోలవరం రివర్స్ టెండరింంగ్ రాజకీయంగా హీట్ను పెంచుతోంది. దీనిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు రివర్స్ టెండరింగ్ రాష్ట్రానికి మంచిది కాదన్న టీడీపీ ..పోలవరం ప్రాజెక్ట్ను కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేసింది. అటు బీజేపీ సైతం.. రివర్స్ టెండరింగ్ను వ్యతిరేకించింది.
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ టెండర్లను రద్దు చేసిన వైసీపీ సర్కారు తీవ్ర విమర్శలకు గురవుతోంది. దీనిపై రివ్యూ చేశారు సీఎం జగన్. ఈ సమావేశానికి పలువురు మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలగకుండా పోలవరం ప్రాజెక్టు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ భేటీలో చర్చించారు. మరోవైపు అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశమైన జగన్.. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
రాష్ట్రంలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రివర్స్ టెండరింగ్ వంటి నిర్ణయాలు మంచివి కావని హితవు పలికారు. రాష్ట్రప్రభుత్వ తీరును కేంద్రం, పోలవరం అథారిటీ , హైకోర్టు తప్పుపట్టినా వారిలో మార్పు రాలేదని దుయ్యబట్టారు సోమిరెడ్డి.