షాకింగ్ న్యూస్.. అరటి పండ్లు ఇక కనిపించవట..

Update: 2019-09-05 10:47 GMT

పెళ్లి.. పేరంటం ఏదైనా అరటి పండుకి ఓ ప్రత్యేక స్థానం. అరటి ఆకులో భోజనం పెడితే ఆ లెవలే వేరు. పచ్చి అరటి కాయల్నీ, అరటి పువ్వునీ కూరగా చేస్తారు. అరటి చెట్టు నుంచి వచ్చే ప్రతిదీ ఎంతో ఉపయోగం. భారత్‌లో అరటి పండు వినియోగం ఎక్కువ. అరటి పంటపై ఆధారపడి ఎంతో మంది రైతులు జీవిస్తున్నారు. మరి అలాంటి అరటి చెట్టు.. భారతీయుల జీవన విధానంలో మమేకమయిన అరటి కనుమరుగవుతుందనే ఊహే కష్టంగా ఉంటుంది. దీనికి కారణం వాతావరణ మార్పులని సైంటిస్టులు చెబుతున్నారు.

భారత్‌తో పాటు అరటి 2050 నాటికి పూర్తిగా అంతరించేపోయే ప్రమాదం వుందని బ్రిటన్‌లోని ఎక్స్‌టర్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అరటి ఉత్పత్తికి సంబంధించిన కీలక అంశాలపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు.. ప్రపంచ వ్యాప్తంగా 86 శాతం అరటిని అందిస్తున్న 27 దేశాల్లో సర్వేలు జరిపి ఈ విషయాన్ని కనుగొన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణంలో మార్పులు అరటి పంటపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని వారు గుర్తించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అధికంగా అరటి సాగు చేస్తున్న భారత్, బ్రెజిల్‌తో పాటు మరో ఎనిమిది దేశాల్లో 2050 నాటికి అరటి దిగుబడి గణనీయంగా తగ్గవచ్చని లేదా పూర్తిగా మాయమయ్యే అవకాశాలు కూడా ఉండొచ్చని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

Similar News