త్వరలో డీజిల్, పెట్రోల్ కార్లను ప్రభుత్వం నిషేధించనున్నదని జరుగుతున్న ప్రచారానికి రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెరదించారు. వాటిని నిషేధించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని గడ్కరీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక రంగం ఎదుగుదలలో ఆటోమొబైల్ రంగం పాత్ర కీలకమన్నారు. దేశ ఎగుమతులు, ఉపాధి రంగంలో వాహనరంగం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల కారణంగా ముడిచమురు దిగుమతి పెరుగుతోందని పేర్కొన్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాల వల్ల కాలుష్యం పెరగడంతో పాటు , రహదారుల భద్రతలోనూ సమస్యలు వస్తున్నాయని తెలిపారు. రూ 4.50 లక్షల కోట్ల విలువతో కూడిన వాహన రంగం ఇక నుంచి కాలుష్య నియత్రణ వైపు దృష్టి సాధించాలని కోరారు. ప్రభుత్వం కూడా కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. దేశంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోందన్నారు.