భాగ్యనగరాన్ని భయపెడుతున్న డెంగ్యూని 15 రోజుల్లో నియంత్రిస్తామన్నారు మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. సోమవారం అధికారులతో రివ్యూ చేశారు. మంగళవారం నుంచి అధికారులను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే అధికారులు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాను కూడా ఇందులో భాగమవుతానన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అన్నీ జ్వరాలు డెంగ్యూ కాదని.. హాస్పిటల్ కు వచ్చే వారికి వైద్య సేవలు చేసి గంట లోపే ఇంటికి పంపాలని అధికారులకు సూచించారు. బస్తీలో దవాఖానల సంఖ్య పెంచడంతో పాటు.. సాయంత్రం ఓపీలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
హైదరాబాద్లో చెత్త వేసే వెయ్యి ప్రాంతాలు గుర్తించి.. వాటిని యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తామన్నారు. ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. సీజనల్ వ్యాధులపై ప్రత్యేకమైన క్యాలెండర్ రూపొందించి నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలు, స్కూళ్లతో పాటు ఇళ్లల్లోనూ దీనిపై ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తామన్నారు.
Also watch :