తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గ్రామం నుండి గోల్కొండ కోట వరకు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలంటూ బీజేపీ పిలుపునిచ్చింది. కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను తమకు అనుకూలంగా మలచుకుంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో జెండావందనాలకు సిద్ధమైంది. పంచాయితీ కార్యాలయాలు, పాఠశాలలు, మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లోనూ జెండాలు ఎగరవేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతలకు సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 9.45కు లక్ష్మణ్ జాతీయ జెండా ఎగరవేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొంటారు. తర్వాత జాతీయ స్థాయిలో చేపడుతున్న సేవాసప్తం కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం పటాన్ చెరువులో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభ వేదికగానే మరోసారి టీఆర్ఎస్ను టార్గెట్ చేయాలన్నది బీజేపీ నేతల వ్యూహం.
టీఆర్ఎస్ ప్రభుత్వం విమోచన దినాన్ని జరపకపోవడంపై మండిపడుతున్న కమలదళం.. దీని ఆవశ్యకతను ప్రజలంతా తెలుసుకోవాలంటోంది. ఉద్యమ సమయంలో విమోచన జరపాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. తర్వాత MIM ఒత్తిడికి లొంగి దీన్ని పక్కకుపెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను పక్కదోవ పట్టిస్తూ.. తన చరిత్రను చెక్కించుకుంటున్నారని మండిపడుతున్నారు. నిజాం అరాచకాలపై పోరాడిన యోధుల జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజెప్పేందుకు వాటిని పాఠ్యాంశాలుగా చేర్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Also watch :